Banner
Watermark
గడ్డపోతారం మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం
📅 13 February 2026, 04:36 PM ✍️ M.Chinna
News Image
వార్తపత్రిక, కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 13: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నివాసంలో సమావేశం నిర్వహించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
గడ్డపోతారం మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా, 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, ఇండిపెండెంట్‌గా 18వ వార్డ్ నుంచి గెలుపొందిన పోతారం సతీష్ ముదిరాజ్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 15కు చేరింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గెలిచిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణతో పాటు సమిష్టి బాధ్యతతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ కొలను బాలిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పులిగిల్ల ప్రకాష్ చారీ, రవీందర్, సురేందర్ గౌడ్, నీరుడి శ్రీనివాస్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home