పశ్చిమాసియాలో పరిణామాలు ఆందోళనకరం: కేంద్ర మంత్రి జయశంకర్
📅 09 March 2026, 05:33 PM
✍️ M.Chinna
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్(Jaishankar) అన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న దాడి అంశంపై ఆయన ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు చర్చలు, సంప్రదింపులు నిర్వహించాలని తాము విశ్వసిస్తామని, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని మంత్రి జయశంకర్ అన్నారు. సంక్షోభం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఎప్పటికప్పడు అంచనా వేస్తున్నామని, ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్లో వేలాది మంది భారతీయులు ఉన్నారని, కొందరు చదువు కోసం వెళ్లగా, మరికొందరు ఉద్యోగం కోసం వెళ్లినట్లు తెలిపారు. మన దేశ ఇంధన భద్రతకు ఆ ప్రాంతం చాలా కీలకమైందని, ఆయిల్.. గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీలు ఉన్నాయన్నారు. ఇరాన్కు అత్యవసరం కానటువంటి పర్యటన చేయవద్దు అని భారతీయులకు సలహా ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.