సుప్రీంకోర్టు సంచలన తీర్పు- హరీష్ రాణా కారుణ్య మరణానికి అనుమతి
📅 11 March 2026, 12:53 PM
✍️ M.Chinna
న్యూఢిల్లీ: 12 ఏళ్లకుపైగా కోమాలో ఉన్న ఓ వ్యక్తి కారుణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 32 ఏళ్ల హరీశ్ రాణాకు చికిత్స నిలిపివేయొచ్చని చెబుతూ, కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.2013లో ఒక భవనం నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి హరీష్ రాణా అనే వ్యక్తి తలకి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి దశాబ్ద కాలానికి పైగా అతను కోమాలోనే ఉన్నాడు. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా, అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. జీవచ్చవంగా మారిని తమ కుమారుడి కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన తల్లిదండ్రులు పలుమార్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే ఆ సమయంలో హరీశ్ కారుణ్యమరణానికి కోర్టులు అంగీకరించలేదు. తాజాగా ఎయిమ్స్ వైద్య బృందం మరోసారి అతడు కోలుకునే అవకాశం లేదని నివేదిక ఇవ్వడంతో హరీష్ తల్లిదండ్రులు మళ్లీ అత్యున్నత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.