సీఈసీ జ్ఞానేశ్కుమార్ అభిశంసనకు ఉభయ సభల్లో విపక్షాల నోటీసులు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించడానికి ప్రతిపక్షాలు పార్లమెంట్లోని ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చాయి. శుక్రవారం లోక్సభ, రాజ్యసభకు అభిశంసన తీర్మాన నోటీసులు అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. 130 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ సభ్యలు నోటీసుపై సంతకం చేసినట్లు పేర్కొన్నారు. అయితే సీఈసీపై పార్లమెంటులో నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. జ్ఞానేశ్కుమార్పై పక్షపాతం, ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం వంటి 7 అభియోగాలను విపక్షాలు మోపాయి.
ఇండియా కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు నోటీసుపై సంతకం చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే కూటమిలో లేని ఆప్, కొంతమంది స్వతంత్ర ఎంపీలు కూడా సంతకం చేశారని పేర్కొన్నాయి. మరికొంత మంది సంతకం చేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారని చెప్పాయి. సీఈసీ జ్ఞానేశ కుమార్పై మొత్తం ఏడు అభియోగాలను నమోదు చేశారు విపక్షాల ఎంపీలు. వాటిలో ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) ప్రక్రియలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తునకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడటం, పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం వంటివి ఆరోపణలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.