ఆస్పత్రి ICUలో భారీ అగ్నిప్రమాదం- 10 మంది రోగులు మృతి
ఒడిశా: ఒడిశాలోని కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుంటుబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల సమయంలో ఐసీయూలోని ట్రామా కేర్ డిపార్ట్మెంట్లో తొలుత మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, రోగుల బంధువుల సహాయంతో ఐసీయూలో ఉన్న రోగులను ఇతర వార్డులకు తరలించారు. ఈ ప్రక్రియలో మొత్తం 23 మంది రోగులను ఇతర విభాగాలకు మార్చారు. రోగులను రక్షించే ప్రయత్నంలో 11 మంది ఆసుపత్రి సిబ్బందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఏడుగురు రోగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఇతర వార్డులకు తరలించే సమయంలో కాలిన గాయాలు లేదా ఊపిరి ఆడక మరణించారు.