పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. లోక్సభలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన లోక్సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి ప్రసంగించారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న ప్రధాని మోదీ.. భారత్ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ యుద్ధం భారత్కు ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని మోదీ అన్నారు. ప్రజలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోందని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు.పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులు ఉన్నారని, గల్ఫ్లో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ లోక్ సభలో చెప్పారు. 24 గంటలూ కంట్రోల్ రూమ్స్, హెల్ప్లైన్స్ ఏర్పాటు చేశామని, 3.75 లక్షల మంది భారతీయులు క్షేమంగా వెనక్కి వచ్చారని మోదీ తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.ఆయిల్, గ్యాస్, ఎరువుల సరఫరాకు హోర్ముజ్ జలసంధి కీలకమని మోదీ చెప్పారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో 60 శాతం LPG ఉత్పత్తి చేస్తున్నామని, 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయని, హోర్ముజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్కు వస్తున్నాయని మోదీ వెల్లడించారు.