Banner
Watermark
భూములకు ఉద్యోగం స్కామ్‌లో లాలూకు హైకోర్టులో చుక్కెదురు
📅 24 March 2026, 05:11 PM ✍️ M.Chinna
News Image
న్యూఢిల్లీ: భూములు తీసుకుని ఉద్యోగాలిచ్చారనే ఆరోపణల కేసులో కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav)కు చుక్కెదురైంది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ ప్రసాద్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. దీంతో లాలూకు ఎలాంటి ఉపశమనం దక్కలేదు. యథాప్రకారం కేసులో విచారణ కొనసాగనుంది.ఏమిటీ కేసు..లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009లో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మందిని గ్రూప్-డి పోస్టుల్లో నియమించారు. దీనికి బదులుగా వారి భూములను లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు ఒక ప్రైవేటు కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ ఆరోపణగా ఉంది. 2022 మే 18న లాలూ, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదైంది. 77 ఏళ్ల లాలూ, ఇతర నిందితులు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.
🏠 Home