Banner
Watermark
వందేమాతరం'కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​ను కొట్టేసిన సుప్రీంకోర్టు
📅 25 March 2026, 04:52 PM ✍️ M.Chinna
News Image
: దేశంలో నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్​కు వ్యతిరేకంగా దాఖలైన పటిషన్​ను విచారణ చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం పాడడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయలేదని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్​, న్యాయమూర్తులు జస్టిస్​ జోయ్​మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్​ ఎం పాంచోలీల త్రిసభ్య ధర్మాసనం ఈ పటిషన్​ను పరిశీలించింది. మహమ్మద్ సయీద్ నూరి దాఖలు చేసిన పిటిషన్​ ప్రీమెచ్యూర్​గా, వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే అనవసర ఆందోళన ఆధారంగా వేసినట్లు అభిప్రాయపడింది.

పిటిషనర్ నూరి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్​ హెగ్డే, తాము దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తామని అన్నారు. కానీ మతం, విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రజలందరూ జాతీయ గేయం పాడాలని బలవంతం చేయకూడదని పేర్కొన్నారు. ఒక వేళ అలా బలవంతం చేస్తే అది దేశంపై విశ్వాసం చూపించాలని బలవంతం చేసినట్లు అవుతుందని అన్నారు.

దీనిపై స్పందించిన జస్టిస్​ బాగ్చీ, జాతీయ గేయం పాడనందుకు ఎవరికైనా శిక్ష పడిందా? లేదా వందేమాతరం పాడనందుకు ఎవరినైనా అధికారిక సభల నుంచి బయటకు పంపేశారా? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్​లో అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అని పిటిషనర్​ను ప్రశ్నించారు.
🏠 Home