Banner
Watermark
రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్‌పై.. డ్రోన్‌ బోటు దాడి
📅 26 March 2026, 05:04 PM ✍️ M.Chinna
News Image
అంకారా: రష్యా చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్‌ నౌకపై డ్రోన్ బోటు దాడి జరిగింది. టర్కీ తీరం సమీపంలోని నల్ల సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడి వల్ల నౌక బ్రిడ్జిపై పేలుడు సంభవించిందని, ఇంజిన్ రూమ్‌లోకి నీరు ప్రవేశించిందని టర్కీ మీడియా పేర్కొంది. (Tanker with Russian oil struck) షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం సియెర్రా లియోన్ జెండా కలిగిన ‘అల్టురా’ నౌక సుమారు 10 లక్షల బ్యారెల్స్‌ ముడి చమురుతో రష్యాలోని నోవోరోస్సిస్క్ ఓడరేవు నుంచి బయలుదేరింది. అయితే యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దీనిపై ఆంక్షలు విధించాయి.

కాగా, ఇస్తాంబుల్ బోస్ఫరస్ జలసంధికి సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ట్యాంకర్‌ను డ్రోన్ బోటు ఢీకొట్టినట్లు టర్కీ మీడియా గురువారం తెలిపింది. టర్కీ సంస్థ బెసిక్టాస్‌కు చెందిన ఈ నౌక బ్రిడ్జిపై పేలుడు సంభవించినట్లు పేర్కొంది. ఈ పేలుడు కారణంగా ట్యాంకర్ ఇంజిన్ రూమ్‌లోకి నీరు ప్రవేశించినట్లు వెల్లడించింది.

మరోవైపు ఈ ఆయిల్‌ ట్యాంకర్‌కు సహాయం కోసం తీర రక్షక దళ నౌక, అత్యవసర ప్రతిస్పందన నౌకను టర్కీ పంపినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఆ నౌకలోని 27 మంది సిబ్బందిని రక్షించినట్లు పేర్కొంది.
🏠 Home