Banner
Watermark
ఏప్రిల్ 1 నుంచి జనగణన- సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్న కేంద్రం
📅 30 March 2026, 04:28 PM ✍️ M.Chinna
News Image
: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన-2027 ప్రక్రియ మొదటి దశ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా హౌజ్ లిస్టింగ్ - హౌజింగ్ సెన్సస్ (HLO)ను నిర్వహించనున్నారు. వివాహం చేసుకోకుండా చాలాకాలంగా కలిసి ఉంటున్న జంటలను ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహ జీవన జంటలను పెళ్లయిన దంపతులలాగే పరిగణించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేశారు.

తొలిసారిగా ప్రజలకు స్వయంగా తమ వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజల సందేహాలను తీర్చేందుకు తరుచుగా అడిగే 33 ప్రశ్నల సమాధానాలను ఆ పోర్టల్‌లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్‌జీఐ) పొందుపర్చింది. హౌజ్ లిస్టింగ్ - హౌజింగ్ సెన్సస్‌ సందర్భంగా ఈ 33 ప్రశ్నలనే ప్రజలను ఎన్యుమరేటర్లు అడగనున్నారు.

జనగణనలో ప్రజలిచ్చే సమాచారాన్ని ఎవ్వరికీ ఇవ్వం : ఆర్‌జీఐ
ఈ సందర్భంగా సోమవారం రోజు విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ కీలక వివరాలను వెల్లడించారు. జనగణన చట్టం (సెన్సస్ యాక్ట్)‌లోని సెక్షన్ -15 అనేది అత్యంత కీలకమైందని, దీని ప్రకారం జనగణన వేళ ప్రజలు అందించే సమాచారాన్ని విశ్వసనీయమైనదిగా పరిగణిస్తామని ఆయన తెలిపారు. చివరకు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద కూడా ఆ సమాచారాన్ని తాము బహిర్గతపర్చమని స్పష్టం చేశారు.

కోర్టులో రుజువుగానూ ఆ సమాచారాన్ని అందించమని, ఏ ఇతర సంస్థకూ ఈ వివరాలను అందించమని మృత్యుంజయ్ తేల్చి చెప్పారు. జనగణన ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో జనగణనను నిర్వహించేందుకు యావత్ పాలనా యంత్రాంగాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగిస్తాయని పేర్కొన్నారు. చివరిసారిగా మన దేశంలో 2011లో జనగణన జరిగిందని, ఇది భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరుగుతున్న 8వ జనగణన అని మృత్యుంజయ్ చెప్పారు.
🏠 Home