• Other News
  • Live TV
  • హర్మూజ్‌ను దాటిన భారత నౌకలు జగ్ వసంత్, పైన్ గ్యాస్

    Reporter
    Journalist Chinna Telangana  |  March 23, 2026, 4:55 pm
    హర్మూజ్‌ను దాటిన భారత నౌకలు జగ్ వసంత్, పైన్ గ్యాస్

    న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు చెందిన రెండు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. పెర్షియన్ గల్ఫ్ నుంచి భారత నౌకలు జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం ఉదయం హర్మూజ్‌ను దాటాయి. త్వరలోనే ఈ నౌకలు దేశీయ పోర్టులకు చేరనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ నౌకల రాకతో గ్యాస్ లభ్యత పెరిగే అవకాశమున్నట్టు చెబుతున్నారు.ఫిబ్రవరి 29న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల అనంతరం హర్జూన్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో నౌకల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వందలాది నౌకలు ఇరాన్-ఒమన్ మధ్యన నిలిచిపోయాయి. భారతదేశం దౌత్య చర్యలతో శివాలిక్, నందాదేవి నౌకలు సురక్షితంగా గత వారం గుజరాత్‌కు చేరుకున్నాయి. ఇంధన భద్రత, గల్ఫ్‌లో భారతీయుల సేఫ్టీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభం ప్రభావం పడిన ఎక్స్‌పోర్లర్లకు రూ.497 కోట్ల రిలీఫ్ ప్యాకేజీని కూడా కేంద్రం ప్రకటించింది.'ఇది మనకే కాదు, యావత్ ప్రపంచానికి పరీక్షా సమయం. మన నాయకులు ఎప్పటికప్పుడు సంబంధిత దేశాల నాయకులతో సంప్రదింపులు సాగిస్తున్నారు. కువైట్ వంటి దేశాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు' అని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సోమవారంనాడు లోక్‌సభలో మద్యప్రాచ్యంలో యుద్ధం గురించి ప్రస్తావిస్తూ, పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టామని, పశ్చిమాసియాలోని కోటి మంది భారతీయుల రక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

    📰 e-Paper Clip
    Google News Follow