న్యూఢిల్లీ: ఇరాన్ను లొంగదీసుకుంటానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. క్రమంగా వెనక్కి జారుకున్నారు. చర్చలు జరుగుతున్నాయని, ఐదు రోజులపాటు యుద్ధానికి విరామం ఇస్తున్నామని ప్రకటించారు. అయితే, ఇరాన్ మాత్రం.. యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ.. తమ కూ అమెరికాకు మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని, తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశా రు. మొత్తమ్మీద, ట్రంప్ మాటలకు విశ్వసనీయత లేద ని, రోజుకో మాట మాట్లాడటమే ఆయన తీరని మరోసారి రుజువైంది. ఏదేమైనా.. ట్రంప్ వెనక్కి తగ్గటం మాత్రం కాదనలేని వాస్తవం. దీనికి కారణాలేమిటి?
లక్ష్యం లేకపోవటం: ఇరాన్ మీద కయ్యానికి కాలు దువ్వినప్పుడు అమెరికా-ఇజ్రాయెల్లకు ఓ స్పష్టమైన లక్ష్యం లేదు. ఖమేనీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని పడగొడతామని ఒకసారి, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటం అని మరోసారి, ఇరాన్ నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందని, ఆ దేశాన్ని లొంగదీసుకుంటామని ఇంకోసారి.. ఇలా పూటకో మాట చెప్పారు ట్రంప్. మరోవైపు, తమ మీద రుద్దిన ఈ యుద్ధాన్ని ఎదుర్కొని తమ దేశ సమగ్రతను కాపాడుకునే ఏకైక, స్పష్టమైన లక్ష్యంతో ఇరాన్ యుద్ధంలోకి దిగింది.
బెడిసికొట్టిన ఆలోచన: వెనెజువెలాలో అధ్యక్షుడు మదురో అధికారిక నివాసంపై దాడి చేసి రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చిన ట్రంప్.. ఇరాన్ మీద కూడా అదే ప్లాన్ అమలు చేయాలని భావించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రాజధాని టెహ్రాన్లో సైనిక, పౌర ఉన్నతాధికారులతో సమావేశమైన తరుణంలో వారి మీద అమెరికా, ఇజ్రాయెల్ అకస్మాత్తుగా బాంబులు కురిపించాయి. వారిని హత్య చేసి యుద్ధం ప్రారంభించాయి. ఖమేనీ హత్య తర్వాత.. అప్పటి వరకూ ఉన్న అంతర్గత విభేదాలు, ప్రభుత్వం మీద ఉన్న అసమ్మతిని కూడా పక్కనపెట్టి.. దేశ పరిరక్షణకు యావత్ ఇరాన్ ఒక్కటైంది. ఆ దేశంలోని ప్రతీ పట్టణంలో.. ఓవైపు క్షిపణులు, బాంబులు పడుతున్నా కూడా బెదరకుండా.. రోడ్ల మీదికి పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలు జరిపారు. ఇప్పటికీ ఇవి కొనసాగుతున్నాయి.