బిహార్లోని నలందలో ఘోర విషాదం జరిగింది. శీతలామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో భారీగా భక్తులు ఒక్కసారిగా గుమిగూడటంతో తీవ్ర రద్దీ ఏర్పడి, ఆందోళనలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది.
అధిక రద్దీ కారణంగా ప్రమాదం
నలంద జిల్లాలోని మాఘ్రా గ్రామంలోని శీతలామాత ఆలయానికి ప్రతి మంగళవారం భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి మహావీర జయంతి, చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి భక్తుల రాక పెరుగుతూ వచ్చింది. ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.