రంగురంగుల ముగ్గులతో కన్నుల పండుగగా మారిన కళాశాల ప్రాంగణం
భాగ్యరధి డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
ఈ సందర్భంగా విద్యార్థినీల కోసం రంగోలి పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించగా, విద్యార్థుల కోసం సంప్రదాయ వస్త్రధారణ కార్యక్రమంతో పాటు కళాశాల టెర్రస్పై గాలిపటాల ఎగురవేత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. రంగోలి పోటీల్లో ఆకర్షణీయమైన డిజైన్లతో అందరి మన్ననలు పొందగా, మెహందీ పోటీల్లో సృజనాత్మకతను చాటుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించారు. గాలిపటాల ఎగురవేత కార్యక్రమం విద్యార్థుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్, ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించి, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.