: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బంగాల్ పర్యటన సందర్భంగా ఏర్పడిన ప్రోటోకాల్ వివాదం రాజకీయ రంగు దాల్చింది. రాష్ట్రపతి కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడిన లోపాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని ఆమె తెలిపారు. ఈ ఘటనకు ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కారణమని పేర్కొన్నారు.
శనివారం ఉత్తర బెంగాల్లోని సిలిగురి సమీపంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే కార్యక్రమ స్థలం మార్పు, అలాగే ముఖ్యమంత్రి లేదా సీనియర్ మంత్రులు ఎవరూ కార్యక్రమానికి హాజరుకాలేదన్న అంశంపై వివాదం చెలరేగింది. దీనిపై కేంద్రం కూడా వివరణ కోరిన నేపథ్యంలో ఆదివారం కోల్కతాలో మీడియాతో మాట్లాడిన మమత బెనర్జీ తన ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి పదవికి, భారత రాజ్యాంగానికి తమ ప్రభుత్వం గౌరవం ఇస్తుందని మమత పేర్కొన్నారు. "రాష్ట్రపతి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయలేదు. ఆ కార్యక్రమం నిర్వహణలో మమ్మల్ని భాగస్వాములుగా కూడా చేయలేదు" అని ఆమె చెప్పారు. కార్యక్రమ నిర్వహణలో జరిగిన లోపాల బాధ్యత ప్రైవేట్ నిర్వాహకులదేనని, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకూ బాధ్యత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.