• Other News
  • Live TV
  • అమెరికాకు రూ.923 కోట్ల వెనెజువెలా బంగారం..!

    Reporter
    Journalist Chinna Telangana  |  March 9, 2026, 5:42 pm
     అమెరికాకు రూ.923 కోట్ల వెనెజువెలా బంగారం..!

    వెనెజువెలా నుంచి అమెరికా) కు ఏకంగా 100 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.923 కోట్లు) విలువైన బంగారం వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా హోంమంత్రి డగ్ బర్గమ్ ధ్రువీకరించారు. శుక్రవారం వెనెజువెలా నుంచి రూ.923 కోట్ల బంగారం వచ్చిందని, ఇంకా ఆ దేశంలో 500 బిలియన్ డాలర్ల విలువైన బంగారం వనరులు ఉన్నాయని బర్గమ్‌ చెప్పారు.వెనెజువెలా ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంగారం మైనింగ్ కంపెనీ మినర్వెన్‌తో లావాదేవీలకు అనుమతిస్తూ అమెరికా ఇప్పటికే లైసెన్స్ జారీచేసింది. ఆ సంస్థతో కలిసి తవ్వకాలు చేపట్టింది. ఇటీవల వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌తో బర్గమ్ భేటీ అయ్యారు. అలాగే అమెరికా మైనింగ్, మినరల్ కంపెనీలతోనూ చర్చలు జరిపారు. ఈ పరిణామాల తర్వాతే మంత్రి స్పందన వచ్చింది.ఖనిజ సంపన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలకు తాము భద్రత కల్పిస్తామని డెల్సీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బర్గమ్‌ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో గెరిల్లా గ్రూపులు, ఇతర గ్రూపులు చురుగ్గా ఉంటాయి. తాజా లైసెన్స్ కింద ఉత్తరకొరియా, రష్యా, ఇరాన్, క్యూబాకు చెందిన వ్యక్తులు, సంస్థలతో మినర్వెన్ ఒప్పందాలు చేసుకోవడంపై నిషేధం ఉంది. వెనెజువెలాలో సమృద్ధిగా ఉన్న కీలక ఖనిజాలపై చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేలా ట్రంప్ యంత్రాంగం ఈ చర్యలు తీసుకుంటోంది.అమెరికాలోకి డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా బంధించి తీసుకెళ్లింది. పైకి డ్రగ్స్‌ పేరు చెబుతున్నప్పటికీ లోపల మాత్రం లాటిన్ అమెరికా దేశాల్లో డ్రాగన్ ప్రాబల్యం తగ్గించడమే అసలు ఉద్దేశమని తెలుస్తోంది. లాటిన్‌ అమెరికాలో డ్రాగన్‌ ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం అగ్రరాజ్యాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. అందుకే లాటిన్‌ అమెరికాలో వనరులను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అక్కడి దేశాల్లో తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటుచేసుకునే పనిలో అమెరికా ఉంది.

    📰 e-Paper Clip
    Google News Follow