అంతర్జాతీయంగా చమురు ధరలను స్థిరీకరించడంలో భారత్ పాత్రను అమెరికా రాయబారి సెర్గియో గోర్ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండడంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించింది. ఆ ప్రయత్నాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భాగమని అమెరికా గుర్తించింది. అత్యధిక చమురు వినియోగంతో పాటు శుద్ధి చేసే దేశాల్లో భారత్ ఒకటి. ఇరుదేశాల పౌరుల మార్కెట్ స్థిరీకరణ కోసం అమెరికా భారత్ కలిసి పనిచేయడం చాలా కీలకం." అని సెర్గియో గోర్ అన్నారు.
చమురు సరఫరా లోటును భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి
అంతకుముందు ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్కు అనుమతి ఇచ్చామని వైట్హౌజ్ తెలిపింది. భారత్లో ఉన్న కొందరు మంచి మిత్రుల వల్లే ఆ దేశానికి చమురు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చినట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్, జాతీయ భద్రతా బృందం కలిసే భారత్కు మినహాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమెరికా భాగస్వామి అయిన భారత్ గతంలో నిబంధనలకు కట్టుబడి రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేసిందని ఆమె వివరించారు. ఇరాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తాత్కాలిక చమురు సరఫరా లోటును భర్తీ చేసేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు.
భారత్కు 30 రోజుల మినహాయింపు ట్రంప్ నిర్ణయమన్న శ్వేతసౌధం
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయమని గతంలో ట్రంప్ చెప్పిన వెంటనే భారత్ ఆపేసిందని లీవిట్ గుర్తు చేశారు. అందువల్లే వారికి అవసరం ఉన్న సమయంలో ఇబ్బందిపెట్టకుండా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. సముద్రంలో ఇప్పటికే ఉన్న రష్యా ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల రష్యాకు పెద్ద ఆర్థిక లబ్ధి కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. ఇరాన్ వల్ల చమురు సరఫరా విషయంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి అమెరికా కృషి చేస్తోందని వివరించారు.