: జమ్ముకశ్మీర్ :మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు జమ్ముకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరి కూడా అన్నారు. జమ్ములోని ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా వారిపై కాల్పులు జరిగాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఇద్దరు వీవీఐపీలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మరోవైపు భద్రతా వైఫల్యం కారణంగా ఈ ఘటన జరిగినట్లు జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
బుధవారం జమ్ములోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న రాయల్ పార్క్లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత కుమార్తె పెళ్లికి ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయనతో పాటు జమ్ముకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరీ, ముఖ్యమంత్రి సలహదారుడు ఉన్నారు. కార్యక్రమం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ఓ వ్యక్తి వెనక నుంచి ఫరూక్పై పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ భద్రతా విదుల్లో ఉన్న ఒక ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒక రౌండ్ కాల్పులు జరిపినప్పటికీ ఎవరూ గాయపడలేదు. ఘటన తర్వాత భద్రతా సిబ్బంది ఫరూక్ అబ్దుల్లాను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.