పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెట్రోల్, ఎల్పీజీ కొరత ఏర్పడవచ్చునన్న వార్తలను ప్రధాని మోదీ ఖండించారు. ప్రజలు ఎవరూ భయాందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాల్ని గమనిస్తున్నామని, భారతీయుల ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకెళ్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇదివరకు ఎలాంటి పరిస్థితి తలెత్తినా ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యమిస్తూ వచ్చామని, ఇప్పుడూ అదే చేస్తామని తేల్చి చెప్పారు. తమిళనాడు తిరుచిరాపల్లిలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నూతన ప్రాజెక్టులు తమిళనాడు యువతకు ఇంధన లభ్యత, కనెక్టివిటీని పెంచుతాయని, అలాగే, వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయని మోదీ పేర్కొన్నారు.
తమిళనాడు పర్యటనలో ఉన్న మోదీ అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. తమిళ ప్రజలు, ప్రతి కుటుంబం కోసం పనిచేసే ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేసే ప్రభుత్వం కాదని మోదీ అన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడం కేవలం ఎన్డీఏ వల్లనే సాధ్యమని ప్రజలు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. 2021లో తమిళనాడు ప్రజలు డీఎంకేను అధికారంలోకి తీసుకొచ్చారని, కానీ వారు దానిని బాధ్యతగా తీసుకోవడానికి బదులుగా, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అన్ని నదులు సముద్రంలోకి వెళ్లినట్లే, తమిళనాడులోని అవినీతి డబ్బు అంతా ఒకే కుటుంబానికి వెళుతోందని డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 2021లో తమిళనాడు ప్రజలు డీఎంకేకు అధికారమిచ్చారని, ఇందుకు బాధ్యత తీసుకోకుండా ప్రజల్ని వదిలేసి వారి కుటుంబానికే ప్రాధాన్యతనిస్తూ వెళ్తున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని ధ్వజమెత్తారు.