పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. ఈ ఓడ లైబీరియా జెండాను పెట్టుకుని ముడి చమురు ట్యాంకర్ను ముంబయి ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడ్ను తీసుకువచ్చిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే చేరుకుందని వివరించింది. మార్చి 1న రాస్ తనురా నుంచి నౌక బయలుదేరినట్లు పేర్కొంది.
హర్మూజ్ దాటేందుకు భారత్కు ఇరాన్ అనుమతి
అంతకుముందు హర్మూజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకలు పయనించడానికి మార్గం సుగమం అయ్యింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక భారత్కు సైతం చేరుకుంది.