• Other News
  • Live TV
  • రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.

    Reporter
    Journalist Chinna Telangana  |  March 16, 2026, 4:46 pm
     రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.

    పాట్నా: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మిస్సింగ్‌ అయ్యారు. పార్టీతో వారు కాంటాక్ట్‌లో లేకుండా పోయారు. వారి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. దీంతో ఆ ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, బీజేపీ నేతలు నితిన్ నబిన్, శివం కుమార్ విజయం దాదాపు ఖాయమని తెలుస్తున్నది.కాగా, బీహార్‌ నుంచి ఐదో స్థానం కోసం ఎన్డీయే అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహ, మహాకూటమి అభ్యర్థి ఏడీ సింగ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి ఎమ్మెల్యేల బలం 35. ఆ కూటమి అభ్యర్థి ఏడీ సింగ్ విజయం సాధించాలంటే కనీసం 41 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎంకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతు కూడా తమకు లభిస్తుందని మహా కూటమి ఆశిస్తున్నది.మరోవైపు ఎన్డీయే అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహ గెలవాలంటే మహా కూటమికి చెందిన కనీసం ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాల్మీకినగర్ ఎమ్మెల్యే సురేంద్ర కుష్వాహా, ఫోర్బ్స్‌గంజ్ ఎమ్మెల్యే మనోజ్ బిశ్వాస్, మణిహరి ఎమ్మెల్యే మనోహర్ ప్రసాద్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల మొబైల్‌ ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. వారు ఎక్కడ ఉన్నారో అన్నది కూడా తెలియడం లేదు.అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయేకు చెందిన మొత్తం 202 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహాకూటమి అభ్యర్థికి మద్దతుగా 37 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మిస్సింగ్‌ అయిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ఆర్జేడీ ఎమ్మెల్యే ఫైసల్ రెహమాన్ ఓటు వేయాల్సి ఉన్నది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానున్నాయి.

    📰 e-Paper Clip
    Google News Follow