: ఆసియాలో అధికార సమతుల్యతను కాపాడటంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకోల్పడంలో భారత్ పాత్ర అత్యంత కీలకమని అమెరికా అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయాల్లో వస్తున్న పెను మార్పుల నేపథ్యంలో భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా రక్షణ శాఖ విధాన ఉప కార్యదర్శి సెక్రటరీ ఎల్బ్రిడ్జ్ కోల్బీ పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
కొన్ని విషయాలపై విభేదాలు ఉన్నప్పటికీ ఉమ్మడి ప్రయోజనాల కోసం భారత్తో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని కోల్బీ స్పష్టం చేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన నాలుగు అంశాల అజెండాను ప్రతిపాదించారు. ఇండో-పసిఫిక్పై ఏ ఒక్క శక్తి ఆధిపత్యం చెలాయించకూడదని పరోక్షంగా చైనాకు చురకలంటించారు.
"ఇండో-పసిఫిక్ అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రతకు కేంద్ర వేదికగా భారత్ మారింది. ఆ ప్రాంతంలోని పరిణామాలు భారత, అమెరికా ప్రయోజనాలు, దీర్ఘకాలిక శ్రేయస్సును నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తాయి. కొన్ని విషయాలపై విభేదాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి ప్రయోజనాల కోసం భారత్తో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉంది. భారత్ను ఒక ఖండాంతర స్థాయి గణతంత్ర రాజ్యంగా, గర్వించదగిన వ్యూహాత్మక సంప్రదాయం కలిగిన దేశంగా, ఇండో-పసిఫిక్ భవిష్యత్తును, విస్తృతంగా అంతర్జాతీయ పరిణామాలను లోతుగా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే దేశంగా యూఎస్ ప్రగాఢమైన గౌరవంతో చూస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గణతంత్ర రాజ్యం భారత్. అంతేకాకుండా భారత్ శక్తివంతమైన, సమర్థవంతమైన సైనిక దళాలను కలిగి ఉంది. ఇండో-పసిఫిక్లో శాంతి, ఆసియాలో అధికార సమతుల్యతను కాపాడడానికి భారత్ కీలకం. "