పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయం కారణం వల్ల ప్రపంచ దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీకి సంబంధించిన పైప్లైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, అలాగే హర్మూజ్ వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా పైప్లైన్ ప్రాజెక్టుల్లో ప్రధాన సమస్యగా ఉన్న అనుమతుల ఆలస్యం, భూసేకరణ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అనుమతుల కోసం స్థిరమైన టైమ్లైన్, పారదర్శక, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాన్ని కూడా ఇది అందిస్తుంది. కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ ద్వారా అన్ని అనుమతులకు ఒకే విధమైన ప్రమాణాలు, కాలపరిమితులు అమలు చేస్తారు. దీంతో సమయానికి అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటారు.
అధికారుల ఆలస్యాలకు చెక్
అయితే నిర్ణీత కాలంలో స్పందన లేకపోతే 'డీమ్డ్ అప్రూవల్' అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. నిర్ణీత గడువులో సంబంధిత అధికారి స్పందించకపోతే డీమ్డ్ అప్రూవల్ నిబంధన కింద ఆటోమేటిక్గా ఆమోదం లభించినట్లే అవుతుంది. ఈ చర్యల వల్ల పైప్లైన్ నిర్మాణ సంస్థలకు ఎదురవుతున్న ఆలస్యాలు, అనిశ్చితి గణనీయంగా తగ్గుతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు మధ్య ఒకే విధమైన సమగ్ర వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.