మరణం అనేది ఎవరికైనా తీరని లోటే, కానీ ఆ మరణంలో కూడా పదిమందికి మేలు చేసే అవకాశం ఉంటే అది అమరత్వమే అవుతుంది. మధ్యప్రదేశ్లోని ఛింద్వాడాకు చెందిన ఒక సామాన్య వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వైద్యులు బ్రతకడం అసాధ్యమని చెప్పిన తరుణంలో ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఐదు కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. తాను భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నా, తన అవయవాల ద్వారా మరో ఐదుగురిలో ప్రాణమై నిలిచాడు ఆ వ్యక్తి. నాగ్పుర్ ఎయిమ్స్ వేదికగా జరిగిన ఈ మానవత్వపు ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు
చందన్గావ్కు చెందిన 55 ఏళ్ల సురేంద్ర మంకర్ ఒక కిరాణా దుకాణంలో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని నాగ్పుర్ ఎయిమ్స్కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్డెడ్గా ప్రకటించారు. మెదడు పని చేయడం ఆగిపోయిందని, ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.