తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో 10 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ కూడా మొదలుకానుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రాజకీయ పార్టీలు విడుదల చేశాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు రకాల హామీలు ప్రకటిస్తున్నాయి. అయితే తిరుచిరాపల్లిలోని ఓ 50 కుటుంబాలు మాత్రం అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఆ కుటుంబలు అసలేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి? అందుకు గల కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుచిరాపల్లిలోని నందవనం గ్రామానికి చెందిన 50కు పైగా కుటుంబాలు కలిసి ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. గత 16 ఏళ్లుగా విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్డు వంటి ప్రాథమిక సదుపాయలు లేకుండా జీవిస్తున్నారని, అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బహిష్కరించాలని ప్రకటించాయి. జాతీయ రహదారిని విస్తరించే సమయంలో తమ ఇళ్లను ఖాళీ చేయించి నందనవం గ్రామానికి తరలించారని, కానీ ఇక్కడ సదుపాయాలు ఏం లేవని వాపోతున్నారు. తమకు ఇంత వరకు విద్యుత్, నీరు, వ్యవసాయానికి మద్దుతు వంటి ప్రాథమిక అవసరాలు కల్పించలేదని నందవవం గ్రామనికి చెందిన స్థానికుడు తంగరాజ్ తెలిపాడు.
హైవే విస్తరణ తర్వాత పునరావాసం- కానీ సదుపాయాలే లేవు
'నందవనం ప్రాంతంలో గత 16 ఏళ్లుగా ప్రజలు విద్యుత్ లేకుండా జీవిస్తున్నారు. మేం ముందుగా జాతీయ రహదారి పక్కన ఉండేవాళ్లం. హైవే విస్తరణ సమయంలో అప్పటి ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి మార్చింది. అప్పటి నుంచి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. ఇప్పటి వరకు నలురుగు ముఖ్యమంత్రులు మారారు. కానీ మానవ మనుగడకు అవసరమైన కరెంట్, త్రాగునీరు, మరుగుదొడ్లు, వ్యవసాయానికి మద్దతు వంటి అంశాల్లో ఎవరూ సహాయం చేయలేదు' అని తంగ్రాజ్ పేర్కొన్నాడు.