మధ్యప్రదేశ్ :మధ్యప్రదేశ్లోని ఓ మెడికల్ కాలేజీ అతి పెద్ద ప్రమాదం తప్పింది. నవజాత శిశువుల వార్డులో షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అదే సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడి సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడం వల్ల 27 మంది శిశువులు సురక్షితంగా బయటపడ్డారు.
అసలేం జరిగిదంటే?
జబల్పుర్లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. నవజాత శిశువుల ఇంటెన్నివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) వద్ద ఉన్న వెయింటింగ్ ఏరియాలోని ఫ్యాన్లో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మొదట దట్టంగా పొగ వచ్చింది. కాసేపటికే అది ఎన్ఐసీయూ వార్డులోకి వ్యాపించింది. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
27 మంది శిశువులు ప్రమాదంలో
అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఎన్ఐసీయూ వార్డులో 27 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వార్డులోకి పరుగెత్తి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పొగను గమనించిన డ్యూటీలో ఉన్న డాక్టర్ వెంటనే స్పందించి ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. 27 మంది శిశువులను వెంటనే మరో వార్డుకు తరలించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ఐసీయూలో చేర్చారు.
ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ శర్మ స్పందించారు. ఫ్యాన్ నుంచి పొగ రావడం ప్రారంభమైన వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంటలను ఆర్పివేసినట్లు చెప్పారు.