షియా ముస్లింలను ఉద్దేశించి 'ఇరాన్కు వెళ్లిపోండి' అని పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో భారత్ స్పందించింది. ఈ వ్యాఖ్యలు ఇస్లామాబాద్ మైనారిటీలపై వ్యవస్థాగత వేధింపుల కొనసాగింపని మండిపడింది. పాక్ ప్రభుత్వ ప్రాయోజిత వివక్ష నిరంతర ధోరణిని ఇది ఎత్తి చూపుతోందని విమర్శించింది. ఈ మేరకు దాయాది దేశంపై మీడియా బ్రీఫింగ్లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు.
"షియాలనుద్దేశించి పాక్ అర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ఇటువంటి వ్యాఖ్యలు ఒక విస్తృత సంక్షోభానికి సూచిక. మునీర్ వ్యాఖ్యలపై వచ్చిన నివేదికలను మేము చూశాము. ఇటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి కావు. షియాలు సహా మైనారిటీలపై పాకిస్థాన్ చేస్తున్న వ్యవస్థాగత వేధింపులలో ఇవి భాగం. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్థాన్లో మైనారిటీ జనాభా తగ్గుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం చేతిలో మైనారిటీలు వేధింపులు, అణచివేతకు గురవుతున్నారు" అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
షియాలపై మునీర్ ఘాటు వ్యాఖ్యలు
మత నాయకులతో జరిగిన ఓ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెచ్చిపోయారు. ఆ సమావేశంలో ఇరాన్ను అంతగా ప్రేమించేవారు పాకిస్థాన్ను విడిచి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. దీంతో మునీర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. తాజాగా మునీర్ ఘాటు వ్యాఖ్యలపై భారత్ మండిపడింది.