పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇటీవల రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎం పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. మార్చి 16న బీహార్ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ (Nitish Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు, ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయడానికి 14 రోజుల గడువును రాజ్యాంగం నిర్దేశించింది.
కాగా, మార్చి 30తో ఈ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎన్నికైన నితీశ్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. సీఎం పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. ఏప్రిల్ 9న నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పలు రాజకీయ కూటములు మారుతూ రికార్డు స్థాయిలో బీహార్ పదో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ త్వరలో ఆ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు.
అయితే బీహార్ చరిత్రలో తొలిసారి బీజేపీ నేత సీఎం పదవి చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం, బీజేపీ శాసనసభా పక్ష నేత సామ్రాట్ చౌదరి ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. నితీశ్ కుమార్ కూడా ఆయనకు బహిరంగంగా మద్దతిచ్చారు. సమృద్ధి యాత్ర సందర్భంగా సామ్రాట్ చౌదరి భుజంపై చేయి వేసిన నితీశ్, ఆయనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.