అసోం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. మొత్తం 31 హామీలతో జాబితాను విడుదల చేసింది. ఇందులో మహిళల సాధికారతకు పెద్దపీట వేసింది. మహిళలకు 'ఒరునోదోయ్' పథకం కింద నగదు సహాయాన్ని రూ.3000కు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే, లఖ్పతి దీదీ పథకం ద్వారా 40 లక్షల మహిళలను లక్షాధికారులుగా తయారు చేసేందుకు రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అసోంను అత్యంత ప్రకాశవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. మంగళవారం గువహటిలో అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోను కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి హిమంత విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన అజెండాగా యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని హిమంత ప్రకటించారు. అయితే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలోని గిరిజన ప్రాంతాలకు ఇది వర్తించదని ఆయన స్పష్టం చేశారు. అలాగే లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వరదల నుంచి విముక్తి కల్పించేందుకు తొలి రెండు సంవత్సరాల్లోనే రూ.18,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.